No products found
Recent searches
Clear all
Bestsellers
Punaruthanam, M. Suguna Rao
Per piece
ఏ ఇద్దరి దళిత జీవితాలూ ఒకలా ఉండవు. ఎమ్. సుగుణరావు గారి కథల్లో దళితులు-దళిత క్రైస్తవులుగా, మాలలుగా, మాదిగలుగా-నిత్యం స్కూళ్లలో, కాలేజీలలో, యూనివర్సిటీలలో వివక్షని ఎదుర్కొనే విద్యార్థులుగా, మరెన్నో అస్తిత్వాలకు చెందిన మనుషులుగా కనిపిస్తారు. చదువులు, ఉద్యోగాల కోసం, గ్రామం నుంచి పట్టణానికి వలస వచ్చి, సామాజిక ఆర్థిక చలన శీలత పొందిన దళితుల జీవితాలు, ప్రాంతం మారినా వెంటాడే కులం తాలూకు అనుభవాలు మనకి దర్శనమిస్తాయి. కులం వల్ల ప్రేమ, పెళ్లి వంటివి మాత్రమే కాదు స్నేహ బంధాలను కూడా నిలవనీయని అకృత్య అమానుష వ్యవస్థగా సుగుణరావుగారు ఈ కథల్లో చిత్రించారు.
"మనం ఎప్పటికీ మైలే వాళ్ళకి! చచ్చిపోయినప్పుడు కొంతమందికి మైల ఉంటుంది. మనం బతికినంతకాలం మైలే!" అన్న నిశ్శబ్దపు వెలి వైరస్ ఆధునిక సమాజానికి పట్టిన చీడపీడలను స్పష్టంగా అక్షరీకరించిన కథలివి. మతం మాస్కు కప్పుకున్న కుల వైరస్ బానిసత్వపు వ్యాధి బారిన పడి గిలగిలా కొట్టుకుంటున్న మానవ సమాజానికి ఈ కథలు రోగనిరోధక శక్తిని, ప్రాణవాయువును, ఇమ్యూనిటీని ఇస్తాయి. 1990 సంవత్సరం నుండే ఆత్మాభిమాన పతాక స్థాయి కథలు రాస్తున్న సుగుణారావుగారు చేయి తిరిగిన రచయితనే కాదు, మనసెరిగిన సున్నిత మనస్సు గలవారు.
- గోగు శ్యామల, రచయిత
దేవుళ్ళు కూడా కులాల పోరులో బలైపోతున్న కాలంలో దళిత క్రైస్తవ వేదనని కథల్లోకి తర్జుమా చేస్తున్నారు సుగుణరావు. ఈ కథలు చదువుతున్నప్పుడు సమకాలీన క్రైస్తవ జీవితంలోని ఒక్కో పేజీని కన్నీళ్లతో తడుముతూ వెళ్తాం. కానీ, సందర్భం వస్తే ఆ కన్నీళ్ళు ఖడ్గ సృష్టి చేస్తాయని రుజువు చేయడం సుగుణరావు గారు సాధించిన విజయం. ఇది తెలుగు కథకి సరికొత్త బలాన్నీ, బలగాన్నీ సమకూర్చే పునరుత్థానం. ఇందులో పాత్రలన్నీ పీడనని అనుభవిస్తూనే, ఆ పీడన మీద యుద్ధం ప్రకటించే ఆత్మగౌరవానికి నిర్వచనంగా నిలుస్తాయి. ఇప్పటివరకూ తెలుగు సాహిత్యం చూడలేని, వినలేని మారుమూల కోణాల అన్వేషణ ఇది.
- అఫ్సర్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా